కోచినుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం లో బాంబ్ బెదిరింపు వచ్చింది అంటూ టెన్షన్ చెలరేగింది. మొత్తం 157 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం మంగళవారం ఉదయం నాగ్పూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాగ్పూర్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే… ముస్కట్ నుంచి వచ్చిన ఇండిగో విమానం, ఉదయం 9:31కి ఢిల్లీకి బయలుదేరింది. ఈ సమయంలో, అధికారిక మెయిల్ ఐడీకి బాంబ్ బెదిరింపు మెసేజ్ రావడంతో, వెంటనే బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ (BTAC) ఏర్పాటైంది. ఈ బెదిరింపును “స్పెసిఫిక్” (నిజమే అనిపించేలా) గా గుర్తించారు.
వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో విమానాన్ని నాగ్పూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాల్సి వచ్చింది. భద్రతా దృష్ట్యా విమానం పూర్తిగా తనిఖీ చేస్తూ ఉండగా, అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దించారు. అనంతరం అన్ని భద్రతా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యాక విమానం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
ఇది జరిగిన కొన్ని గంటలకే, మరో ఘటన జర్మనీలోనూ జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లుఫ్తాన్సా LH752 విమానానికీ అదే తరహా బెదిరింపు మెయిల్ వచ్చింది. జూన్ 15 సాయంత్రం 6:01 కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమై, విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్కి పంపించారు. అప్పటికి అది ఇండియన్ ఎయిర్స్పేస్లోకి కూడా రాలేదు.
లుఫ్తాన్సా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతే మా ప్రాధాన్యత అన్నారు. అటు ప్రయాణికులను ఫ్రాంక్ఫర్ట్లోే నిలిపి, తరువాతి విమానంలో హైదరాబాద్కి పంపనున్నట్లు చెప్పారు.
ఈ రెండు సంఘటనలకూ ముందే, జూన్ 13న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి మిడ్-ఎయిర్లో బాంబ్ బెదిరింపు రావడం, దానిని తిరిగి ఫుకెట్కి ల్యాండ్ చేయడం జరిగింది.
ఈ మొత్తం సంఘటనలతో, భారతదేశంలో విమాన ప్రయాణాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అధికారి వర్గాలు, ప్రతి ఒక్క బెదిరింపును SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) ప్రకారం డీల్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.